నాలా పేరుతో కాలువ తీయడంపై ప్లాట్ల యజమానుల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-06-27T05:15:23+05:30 IST
నాలా పేరుతో కాలువ తీయడంపై ప్లాట్ల యజమానుల ఆగ్రహం
- అధికారులు తవ్వించిన కాలువ పూడ్చి ఆందోళన
ఘట్కేసర్, జూన్ 26 : ఇటీవల పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి మహాలక్ష్మిపురం కాలనీలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు తవ్వించిన నాలా కాలువను ప్లాట్ల యాజమానులు ఎక్స్కావేటర్లతో పూడ్చివేయించి ఆందోళన నిర్వహించారు. ఆదివారం మహాలక్ష్మిపురం ప్లాట్ల యజమానులు సమావేశమయ్యారు. అధికారులు ప్లాట్ల మధ్యలోంచి నాలా పేరుతో కనీస సమాచారం ఇవ్వకుండా కాలువ తవ్వించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం తాము ప్లాట్లు కొనుగోలు చేయించడంతోపాటు ఎల్ఆర్ఎస్ అనుమతులు సైతం పొందినట్లు వారు తెలిపారు. ఇన్ని సంవత్సరాలు లేని నాలా.. ఇప్పుడులా వచ్చిందని ప్రశ్నించారు. ఇంతలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు వచ్చి నాలాను పూడ్చేస్తున్న ఎక్స్కావేటర్లను అక్కడి నుంచి పంపించారు. తమ ప్లాట్లలో పనులు చేసుకోవద్దని చెప్పడానికి మీరెవరంటూ మున్సిపల్ సబ్బందిని, పోలీసులను ప్రశ్నించారు. తిరిగి ఎక్స్కావేటర్లను రప్పించి కాలువను పూర్తిగా పూడ్చివేయించారు. ప్లాట్లలో తవ్వకాలు చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీదేవి, ప్రమీల, చుక్కయ్య, పద్మ, దయాకర్, శంకర్, మదుకర్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.