పడిపోయిన పచ్చిమిర్చి ధర
ABN , First Publish Date - 2022-09-24T05:09:53+05:30 IST
మార్కెట్లో పచ్చి మిర్చి ధర పాతాళానికి పడిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు
కూలీల ఖర్చులు కూడా దక్కని దుస్థితి
ఆందోళనలో అన్నదాతలు
గుత్తి రూరల్ : మార్కెట్లో పచ్చి మిర్చి ధర పాతాళానికి పడిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా బోరు బావుల కింద సుమారు 350 హెక్టార్లలో పచ్చిమిర్చి పంట సాగు చేశారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేశారు. రెండు, మూడు నెలల కిందట మిర్చికి మార్కెట్లో మంచి ధర ఉండటంతో ఉత్సాహంగా పంట సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ధర పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలు క్రితం మార్కెట్లో క్వింటా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు ధర పలికింది. అదే ధర దక్కితే అప్పుల ఊబి నుంచి బయటపడతామని రైతులు ఆశించారు. ఒక్కసారిగా మిర్చి క్వింటా ధర రూ. 800కి పడిపోవడంతో పెట్టుబడుల సంగతి దేవుడెరుగు కనీసం కూలీల ఖర్చులు దక్కవని రైతులు వాపోతున్నారు.
పచ్చి మిర్చి నారు పోసిన తరువాత 15 రోజుల నుంచి 25 రోజుల మధ్య నాటడానికి ఎకరాకు దాదాపు 60 మంది కూలీలతో పని చేయించామనీ వారికి రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకు ఖర్చు అయిందన్నారు. కలుపు తీసేందుకు మరో రూ. 5 వేలు వచ్చిందనీ నాటిన 30 రోజుల నుంచి పంటకు తెగుళ్లు రాకుండా ఉండటానికి 5 రోజులకు ఒక్కసారి మందులు పిచికారీ చేశామన్నారు. వాటితో పాటు పైపాటి ఎరువులు, మందులు వేశామన్నారు. ఇలా ఎకరాకు విత్తనాలు కూలీలు ఎరువులు మందులకు రూ. 60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అయిందని రైతులు తెలిపారు. పడిన కష్టానికి చేసిన పనికి అనుగుణంగా దిగుబడి కూడా బాగా వచ్చిందని సంబర పడ్డారు. క్వింటా రూ.2 వేలకు పైగా అమ్ముడుపోతే ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా మిగులుతాయని భావించారు. పంట చేతికి వచ్చే సమయానికి మిర్చి ధర క్వింటా రూ. 800కి తగ్గిపోవడంతో పెట్టుబడి కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.