స్కూల్ బస్సుల సీజ్
ABN , First Publish Date - 2022-09-23T06:25:18+05:30 IST
చిత్తూరులో గురువారం రాత్రి భారీ సంఖ్యలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను సీజ్ చేయడం కలకలం రేపింది.
చిత్తూరు (సిటీ/సెంట్రల్): చిత్తూరులో గురువారం రాత్రి భారీ సంఖ్యలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను సీజ్ చేయడం కలకలం రేపింది. సీఎం సభకు వాహనాలను ఇవ్వలేదనే కక్ష సాధింపులో భాగంగా వివిధ కారణాలు చూపుతూ వీటిని రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అప్పుడప్పుడు ఒకటెండ్రోజులు స్కూల్ బస్సులు సామర్థ్యం, విద్యార్థుల సంఖ్య, బస్సు స్థితి, పన్నులు చెల్లింపులు ఇతర వాటిని పరిశీలిస్తారు. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు స్కూళ్ల బస్సులనే టార్గెట్ చేస్తూ తనిఖీలు చేయడం వివాదాస్పదంగా మారింది. 60కి పైగా బస్సులను సీజ్చేసి డీటీసీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులను తరలించడానికి ఇబ్బందిగా ఉంటుందని కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సీఎం సభకు బస్సులను పంపడానికి నిరాకరించారు. అందుకనే సీజ్ చేసి వేధిస్తున్నారనే విమర్శలున్నాయి.