వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-12-01T06:39:25+05:30 IST
తుఫాను కారణంగా జలమయమైన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
రేణిగుంట, నవంబరు 30: తుఫాను కారణంగా జలమయమైన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. రేణిగుంట మండలం వెదళ్లచెరువు ఎస్టీకాలనీ, జీపాళెం- గాజులమండ్యం మధ్య కొట్టుకుపోయిన కాజ్వేను మంగళవారం పరిశీలించిన ఆయన అధికారులతో మాట్లాడారు. వర్షపునీరు నిల్వ ఉన్న కాలనీల్లో నీటిని త్వరగా తరలించి అక్కడి ప్రజలకు వైద్యసేవలందించాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు, వైద్యసిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా ఉన్న కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎస్టీ కాలనీ ప్రజలను వెంటనే పునరావాసాలకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కనకనరసారెడ్డి, తహసీల్దారు శివప్రసాద్, ఎంపీడీవో హరిబాబు, డిప్యూటీ తహసీల్దారు ఏకే ప్రేమ్కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.