టైరు పగిలి లారీని ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2021-10-31T06:26:20+05:30 IST

పెళ్లి వేడుకకు వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు వు కబళించింది.

టైరు పగిలి లారీని ఢీకొన్న కారు
కారులో ఇరుక్కున్న మృతదేహం..

ఘోర ప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన 

నలుగురి దుర్మరణం

చిన్నారికి తీవ్రగాయాలు

బత్తలపల్లి, అక్టోబరు 30: పెళ్లి వేడుకకు వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు వు కబళించింది. మండలంలోని జ్వాలాపురం వద్ద శనివారం సాయంత్రం కారు ముందు టైరు పగిలి అదుపుతప్పి అటుగా వెళ్తున్న ఓ లారీని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అమ్మాజీ కుటుంబసభ్యులు ఐదుగురు కారులో అనంతపురంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి శనివారం బయల్దేరారు. జ్వాలాపురం వద్దకు రాగానే వారు ప్ర యాణిస్తున్న కారు ముందు టైరు పేలడంతో అదుపు తప్పి, ఎదురుగా వచ్చే లారీని ఢీకొంది. ప్ర మాదంలో కారులోనే నలుగురు తీవ్ర గాయాలతో మృతిచెందారు. మృతుల్లో అమ్మాజీ(50)తోపాటు కుమారుడు రెడ్డిబాషా(25), కుమార్తె రేష్మా(30), అల్లుడు బాబు (36) ఉన్నారు. తీవ్రంగా గాయపడి మనవరాలు తస్మీనభాను(8)ను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. మృతుల స్వగ్రామం తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లి కాగా.. 15 ఏళ్ల క్రితం జీవనోపాధికి మదనపల్లి వెళ్లి స్థిరపడినట్లు తెలిసింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, స్థానికులతోపాటు ఎక్స్‌కవేటర్‌ సాయంతో కారు లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ధర్మవరం ప్ర భుత్వాస్పత్రికి తరలించారు. డీ ఎస్పీ రమాకాంత, బత్తలపల్లి రూరల్‌ సీఐ మన్సూరుద్దీన, ఎస్‌ ఐ శ్రీహర్ష.. సిబ్బందితో ప్రమాద స్థలంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.


గ్రామంలో విషాదం...

తనకల్లు: జ్వాలాపురం సమీపాన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కడపలవారిపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు  మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కడపలవారిపల్లి వాసులు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. జీవనోపాధి కోసం చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్లి అమ్మాజీ కంకరమిషనలో పనిచేస్తుండగా.. యువకుడైన రెడ్డిబాషా కారు పెట్టుకుని, కుటుంబానికి తోడుగా ఉండేవాడు.







Updated Date - 2021-10-31T06:26:20+05:30 IST