అగ్నిపథ్ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-06-28T04:54:54+05:30 IST
అగ్నిపథ్ను రద్దు చేయాలి
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు
వికారాబాద్ జూన్27 (ఆంధ్రజ్యోతి జిల్లా ప్రతినిధి): సైనికులను అవమాన పరుస్తూ, యువతను నిర్వీర్యం చేసే అగ్నిపథ్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ నేతృత్వంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష నిర్వహించగా, పరిగిలో అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు కొనసాగాయి. తాండూరులో అంబేద్కర్ చౌరస్తాలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్ మహరాజ్, కొడంగల్లో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలకిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలో సత్యాగ్రహ దీక్షలు జరిగాయి. అగ్నిపథ్ ద్వారా రక్షణ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకం చేపట్టడం సరైనచర్య కాదన్నారు అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా సత్యాగ్రహ దీక్షలు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో సత్యాగ్రహ దీక్షలో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి పాల్గొని మాట్లాడారు. సైనిక శక్తిని, దేశభక్తిని నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. దీక్షకు కల్వకుర్తి నియోజకవర్గంలోని మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల పట్టణ కేంద్రంతో పాటు షాద్నగర్లో సత్యాగ్రహ దీక్షలు కొనసాగాయి.