కుప్పంలో సీఎంకు స్వాగత ఏర్పాట్ల సందడి
ABN , First Publish Date - 2022-09-23T06:26:30+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లు గురువారం సాయంత్రానికి పూర్తయ్యాయి.
కుప్పం, సెప్టెంబరు 22: ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లు గురువారం సాయంత్రానికి పూర్తయ్యాయి. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్ జి.శ్రీనివాసులు, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ భరత్, రెస్కో ఛైర్మన్ సెంథిల్కుమార్, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ రిషాంత్రెడ్డి పర్యవేక్షించారు. సీఎం పర్యటనకు ఎస్పీ, ముగ్గురు ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, 43 మంది సీఐలు, 135 మంది ఎస్సైలు, 223 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1778 మంది పోలీసులు, హోంగార్డులు, ఇతర భద్రతా విభాగాలకు చెందిన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుప్పం చెరువుకట్టవద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్నుంచి బంగారునత్తం పంచాయతీ పరిఽధిలో సీఎం పాల్గొననున్న సభాస్థలిదాకా రోడ్డు మార్గంలో గురువారం సాయంత్రం పోలీసులు వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎంకు ఆహ్వానం పలుకుతున్న బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలతో ఈ మార్గం మొత్తం నిండిపోయింది. ఎమ్మెల్సీ భరత్, రెస్కో ఛైర్మన్ సెంథిల్కుమార్, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ పోటీలుపడి వీటిని ఏర్పాటు చేశారు.