పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-07-07T05:45:12+05:30 IST
పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్యాయత్నం
దోమ, జూలైౖ 6 : ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన యువతి చాకుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లికి చెందిన బ్యాగరి అంజిలమ్మ, పద్మమ్మల కుమారుడు నవీన్(25) కొన్ని నెలలుగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తున్నాడు. అదేవిధంగా నగరంలోని ఈసీఐఎల్లోని నేరేడ్మెట్కు చెందిన యువతి (22) కూడా నవీన్ పనిచేసే సూపర్ మార్కెట్లోనే పనిచేస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఈ క్రమంలో ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. నవీన్ అంగీకరించలేదు. పది రోజుల క్రితం నవీన్ బంజారాహిల్స్ నుంచి ఊటుపల్లికి వచ్చి గ్రామంలోనే ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న యువతి వారం రోజుల క్రితం ఊటుపల్లికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని వేడుకోగా.. నవీన్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని దోమ పీఎ్సకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ యువతి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ప్రేమ వ్యవహారం తెలిపింది. దీంతో బుధవారం యువతి, ఆమె తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఊటుపల్లిలోని నవీన్ ఇంటికి వచ్చి గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. కానీ, వారిద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో.. కులాంతర వివాహానికి యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతేకాకుండా రూ.10లక్షలు, 10 తులాల బంగారం కట్నంగా ఇస్తేనే పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో.. యువతి తల్లిదం డ్రులు అంత కట్నకానుకలు ఇచ్చుకోలేమని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రియుడి ఇంటిముందే చాకుతో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు పరిగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఉన్నత వైద్యం కోసం నగరానికి తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తండ్రి దోమ పోలీ్సలకు ఫిర్యాదు చేశాడు.