‘ఉపాధి’ పథకానికి నిధుల కొరత లేదు
ABN , First Publish Date - 2021-07-26T06:29:48+05:30 IST
ఉపాధి హామీ పథకానికి నిధుల కొరతలేదని.. అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకానికి నిధుల కొరతలేదని.. అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉపాధి పథకం అధికారులతో సమీక్షించారు. రానున్న పది రోజుల్లో మెగా ప్లాంటేషన్ జరగాలన్నారు. జగనన్న పచ్చతోరణంలో నాటే ప్రతి మొక్కా బతకాలని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో గుర్తించిన 1,100 కి.మీ జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కల నాటడానికి జరుగుతున్న గుంతల తవ్వకం వేగవంతం కావాలని సూచించారు. మొక్కల పెంపకంలో అవెన్యూ, ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్కు ప్రాధాన్యం ఉండాలన్నారు. ఈ పథకం నుంచి రూ.6-7వేల కోట్లు వేతన జీవులకు అందాలన్నారు. చెరువుల్లో పూడికతీత పనులు, సిల్ట్ అప్లికేషన్ వంటివి గుర్తించి పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చినతాతయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబరు ముత్తంశెట్టి విశ్వనాథ్, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.