నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2022-05-29T07:07:11+05:30 IST
ఆదివారం జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు తెలిపారు.
హాల్టిక్కెట్లు రాలేదని ఆందోళన వద్దు
ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం
అమలాపురం టౌన్, మే 28: ఆదివారం జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం లేక పోవడంతో కోనసీమవ్యాప్తంగా ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్టిక్కెట్లు రావడం లేదన్న ఆందోళనపై విలేకరులు డీఆర్వోను ప్రశ్నించారు. దీనికి ఆయన విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఇప్పటికే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్ల ద్వారా వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాల వివరాలను పంపించడం జరిగిందని చెప్పారు. విద్యార్థులు ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకుని పరీక్షా కేంద్రానికి వస్తే సరిపోతుందన్నారు. ఆధార్కార్డు, బ్యాంకు ఖాతాతోపాటు ఫొటో గుర్తింపు ఉన్న కార్డు ఉంటే కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే విధంగా బస్సు సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా పాలిసెట్ 2022 పరీక్షకు 2380 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు డీఆర్వో సత్తి బాబు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగు తుందన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని కోరారు. ఇదిలా ఉండగా అమలాపురం సమీపంలోని పాలిసెట్-2022 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా శనివారం స్వయంగా పరిశీలించారు. భూపయ్య అగ్రహారంలోని శ్రీవెంకటేశ్వరా డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ కేఎస్వీఎన్ మనోహర్కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో కరాటం ప్రవీణ్, కె.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా భట్లపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
10వ తరగతి హాల్ టిక్కెట్లు తెచ్చుకున్నా అనుమతిస్తాం..
అమలాపురంటౌన్, మే 28: పాలిసెట్-2022 ప్రవేశపరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా హెచ్బీ పెన్సిల్, రబ్బరు, తెచ్చుకోవాలి. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ పనిచేయని కారణంగా దగ్గర్లో ఉన్న యానాం, రామచంద్రపురం వెళ్లి హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని జిల్లా కోఆర్డినేటర్ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోనివారు 10వ తరగతి హాల్టికెట్ లేదా ఆధార్కార్డును తీసుకుని పరీక్షకు హాజరుకావచ్చునని ఆయన తెలిపారు.
పాలిసెట్పై ముందుచూపేది..
కోనసీమ జిల్లాలో ఆదివారం జరగనున్న పాలిటెక్నికల్ ఎంట్రన్స్ పరీక్ష రాస్తున్న విద్యార్థులపై ఇంటర్నెట్ సేవల బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలిటెక్ని కల్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్న రెవెన్యూ ఉన్నతాధికారులు విద్యార్థుల్లో ఉన్న ఆందోళన నివృత్తి చేయడంలో విఫలమయ్యారు. ఆదివారం జరిగే పరీక్షలకు సంబంధించి హాల్టిక్కెట్లు డౌన్లోడింగ్ కాక పోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. అయినప్ప టికీ కలెక్టర్ కార్యాలయం నుంచి స్పందన కరువైంది. పాత్రికేయులు పరిస్థితిని శనివారం కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువెళ్లగా, వివరాలు డీఆర్వో సత్తిబా బును అడిగి తెలుసుకోవాలని చెప్పారు. దీనిపై డీఆర్వో సత్తిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు హాల్టిక్కెట్ లేక పోయినా ఏదో గుర్తింపు కార్డుతో ఆయా పరీక్షా కేంద్రా లకు హాజరుకావచ్చని చెప్పారు. 2380 మంది విద్యా ర్థుల కోసం పది పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. కనీసం ఒకరోజు ముందు సమాచారమందిస్తే విద్యార్థు లకు తెలిసేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు.