ఉపాధ్యాయులకు ఆర్యోగంపై శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2021-05-10T05:46:51+05:30 IST
ఆధునిక సాంకేతిక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పలు కార్యక్రమాలను ఉపాధ్యాయులకు అందిస్తూ సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆదర్శంగా నిలుస్తుంది
సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వినూత్న ప్రయత్నం
రిజిస్ట్రేషన్ చేసుకున్న సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులు
నేటి నుంచి పది రోజుల పాటు ప్రాణయామం, ధ్యానంపై యూట్యూబ్లో శిక్షణ
కొండపాక, మే9: ఆధునిక సాంకేతిక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పలు కార్యక్రమాలను ఉపాధ్యాయులకు అందిస్తూ సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆదర్శంగా నిలుస్తుంది. ఉపాధ్యాయుల జ్ఞానసముపార్జన పెంపుదల కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తుంది. సిద్దిపేట డీఈవో రవికాంతారావు ప్రత్యేక శ్రద్ధతో ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నారు. జూమ్ యాప్తో పాటు సిద్దిపేట విద్య మిత్ర అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉపాధ్యాయులకు సూచనలు, శిక్షణ తరగతులు అందిస్తున్నారు.
ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత
కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఎంతో మంది ఉపాధ్యాయులు సైతం కరోనా బారినపడ్డారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయుల ఆరోగ్యభద్రతకు భరోసానివ్వాలనే సంకల్పంతో సిద్దిపేట యోగా అసోసియేషన్ సహకారంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రాణయామం, ధాన్యం, తదితర వాటిని ఈ శిక్షణలో అందిస్తారు. విద్యమిత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
పది రోజుల పాటు శిక్షణ
సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం చేకూర్చే ప్రాణయామం, ధ్యానసాధనలను యోగ శిక్షకుడు తోట సతీష్ శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచి 8 వరకు శిక్షణ ఇవ్వనున్నారు.
2 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తి
జిల్లాలోని రెండు వేల మంది ఉపాధ్యాయులు శిక్షణ కోసం రిజిస్ర్టేషన్ పూర్తిచేసుకున్నారు. వీరంతా సోమవారం నుంచి శిక్షణ పొందనున్నారు. ఉపాధ్యాయులే కాకుండా ఆరోగ్య అభిమానులు ఈఛానల్ ద్వారా ప్రాణాయామం, ధ్యానసాధనలను నేర్చుకోవడం కోసం యూట్యూబ్ ఛానల్ వీక్షించవచ్చని సూచించారు. అందుకోసం ‘‘హెచ్టీటీపీఎ్స://వైఓయూటీయూ.బీఈ/క్యూకే1-వైఎండబ్ల్యూక్యూజడ్ఏఈ’ లింకు ద్వారా శిక్షణా తరగతులను చూడొచ్చని పేర్కొన్నారు.