సర్దుబాటు షాక్
ABN , First Publish Date - 2022-08-11T07:16:57+05:30 IST
విద్యుత్ వినియోగదా రులపై అదనపు బాదుడు కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ చార్జీల రూపంలో భారం మోపనుంది. 2014 నుంచి 2019 వరకూ వినియో గించిన విద్యుత్పై సర్దు బాటు పేరిట 18 నెలల పాటు అదనపు చార్జీలు వసూలు చేయనుంది. ఈ నెల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడు తోంది.
- ట్రూఅప్ పేరుతో రూ.43.20కోట్ల మేర బాదుడు
- 2014నుంచి వినియోగించిన విద్యుత్పై అదనపు చార్జీలు
- వినియోగదారులపై ప్రతినెలా రూ.2.40కోట్ల భారం
విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు పేరిట మళ్లీ ట్రూఅప్ చార్జీల భారం పడ నుంది. గతంలో ట్రూఅప్ చార్జీలు వసూ లు చేయగా ప్రజలనుంచి తీవ్ర వ్యతిరే కత వ్యక్తమైంది. కొంతమంది వినియో గదారులు కోర్టులను కూడా ఆశ్రయిం చడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మళ్లీ ఇప్పుడు ట్రూఅప్ పేరుతో చార్జీల మోతకు సన్నద్ధమైంది. 2014 నుంచి 2019 వరకూ వినియోగించిన విద్యుత్కు సంబంధించి 18 నెలల పాటు ట్రూఅప్ చార్జీలు వసూలు చేయ నుంది. దీంతో ఉమ్మడి జిల్లా వినియోగ దారులపై మొత్తంగా రూ.43.20కోట్ల మేర భారం పడనుంది.
సామర్లకోట, ఆగస్టు 10: విద్యుత్ వినియోగదా రులపై అదనపు బాదుడు కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ చార్జీల రూపంలో భారం మోపనుంది. 2014 నుంచి 2019 వరకూ వినియో గించిన విద్యుత్పై సర్దు బాటు పేరిట 18 నెలల పాటు అదనపు చార్జీలు వసూలు చేయనుంది. ఈ నెల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడు తోంది. ఒక్కో యూనిట్పై ఏడు పైసల చొప్పున వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పు జిల్లాలో వినియోగదారులనుంచి ప్రతినెలా రూ.2.40కోట్ల మేర భారం మోపనుంది. ఈ ఏడాది ఏప్రిల్లో విద్యుత్ చార్జీలు పెరగగా, తాజాగా మరోసారి ట్రూఅప్ చార్జీల పేరిట అదనపు భారం పడనుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట వినియోగించిన విద్యుత్కు ఇప్పుడు అదనపు వసూళ్లు ఏంటని మధనపడుతున్నారు. వాస్త వానికి గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అన్ని కేటగిరీల వినియో గదారులనుంచి రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ చార్జీలు వసూలు చేసింది. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేఖత వచ్చింది. కొంతమంది వినియోగదారులు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూఅప్ చార్జీలను గతేడాది నవంబరులో రెవెన్యూ జర్నల్ ద్వారా సర్చార్జీలతోపాటు బిల్లులో తిరిగి జమచేసింది. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో ఇప్పుడు మళ్లీ ట్రూఅప్ చార్జీలు వసూలు చేయనుంది. ఈ నెల నుంచే వసూలు ప్రారంభించనుంది.
అదనపు భారం ఇలా. .
2014-15 ఆర్ధిక సంవత్సరంనుంచి 2018-19 వరకూ ఐదేళ్లలో వినియోగించిన మొత్తం విద్యుత్కు, యూనిట్కు ఏడు పైసల వంతున ట్రూఅప్ చార్జీలను వసూలు లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని ప్రస్తుత నెల నుంచి 18నెలలపాటు సర్దుబాటు చేయనున్నారు. ఉమ్మడి తూర్పు జిల్లాలో 18.30 లక్షల విద్యుత్ వినియోగదారులు వివిధ కేటగిరిల్లో ఉన్నారు. ఇవి గాక వ్యవసాయావసర విద్యుత్ సర్వీసులు 46,700 ఉండగా ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ గృహావసర విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ఈ రెండు కేటగిరీలకు ప్రభుత్వం రాయితీలు అమలు చేస్తున్నందున ప్రభుత్వమే నేరుగా ట్రూఅప్ చార్జీలను చెల్లించనుంది. ఇక మిగిలిన అన్ని కేటగిరీలకు సంబంధించి 18.30 లక్షల విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిపై నెలకు 167కోట్ల55లక్షల29వేల400 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నట్లు విద్యుత్ అధికారులు గణాంక సమాచారం ద్వారా తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యుత్ వినియోగదారులపై ప్రతినెలా ట్రూఅప్ చార్జీల పేరిట రూ.2.40కోట్లు చొప్పున 18నెలల్లో రూ.43.20కోట్ల మేర అదనపు భారం పడనుంది.
అద్దెకుండే వారి పరిస్థితి దారుణం
అద్దె ఇళ్లల్లో ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉండనుంది. గతంలో ఎవరో వినియోగించిన విద్యుత్కు ప్రస్తుతం నివాసం ఉంటున్నవారు ట్రూఅప్ చార్జీలు చెల్లించాలి. ఇది చేయని నేరానికి శిక్ష అనుభవించడం లాంటిదేనని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. అద్దెకున్న వినియోగదారులు చెల్లించకపోతే ఇంటి యజమాని భరించాలనే డిమాండ్ కూడా మొదలైంది. దీనిపై వివాదాలు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ నెల బిల్లు చేతికి అందితే షాక్ కొట్టడం ఖాయం. దీనిపై కొందరు న్యాయనిపుణులను ఆశ్రయిస్తున్నారు. ట్రూఅప్ చార్జీల వసూళ్లను విరమించుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఈనెల నుంచే అమలు
కె.ఆదినారాయణ, ఎస్ఏవో, ఏపీఈపీడీసీఎల్
ఈనెల నుంచే తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ట్రూఅప్ చార్జీల సర్దుబాటు జరుగుతుంది. యూనిట్కు కేవలం ఏడు పైసల చొప్పున ట్రూఅప్ చార్జీలను విధించాం. నెలకు రూ.2.40 కోట్ల వసూలు అయ్యే అవకాశం ఉంది. 18నెలల వరకూ ఇన్స్టాల్మెంట్ గడువు విధించాము.