జాతీయ సమైక్యతను పెంపొందించేలా వజ్రోత్సవాలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-08-08T05:46:14+05:30 IST
జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర
- జూమ్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 7 : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా ఆమె స్వతంత్ర భారత వజ్రోత్స వేడుకల నిర్వహణపై శాసనసభ్యులు, జడ్పీ చైర్పర్సన్, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వజ్రోత్స వేడుకలను ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఆగస్టు 8న హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలు, రైతు బంధు సమితీ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు సంబరాలు ఉంటాయని వెల్లడించారు.
వజ్రోత్స వేడుకల కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 15వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేసేలా ఇంటింటికి జెండాలను పంపిణీ చేయాలని, అదే సమయంలో మువ్వన్నెల జెండా గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జూమ్ మీటింగ్లో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, జైపాల్యాదవ్, అంజయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జడ్పీ సీఈవో దిలీ్పకుమార్, డీఆర్డీవో పీడీ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివా్సరెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలి
దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణ కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంత్రి సబితారెడ్డి నగరంలోని శ్రీనగర్కాలనీలో తన గృహంలో నీరు నిలువ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అరికట్టడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఒక సబ్ కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యాలయాల్లో కూడా ప్రతి ప్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు నీరు నిలువ ఉండటం కారణంగానే వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. పాత కుండీలు, పాత టైర్లలో నీటిని తొలగించాలన్నారు.