మరిన్ని నిధులు ఇస్తాం
ABN , First Publish Date - 2022-05-24T04:23:43+05:30 IST
జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ కింద జిల్లాలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
- అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
- ఎంపీ రామ్మోహన్నాయుడు
కలెక్టరేట్,
మే 23 : జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని
ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ కింద జిల్లాలో
చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,
కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ
సందర్భంగా ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ‘ఎంపీ ల్యాడ్ కింద జిల్లాలో
రూ.1,147.44 లక్షలతో 233 పనులు మంజూరు చేశాం. ఇప్పటివరకు కేవలం 42 పనులు
మాత్రమే పూర్తయ్యాయి. 149 పనులు ప్రారంభమయ్యాయి. మరో 42 పనులు పురోగతిలో
ఉన్నాయి. వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి’ అని ఆదేశించారు.
విజయనగరం
ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలకు
సంబంధించి రూ.64.16 లక్షలతో 24 పనులు మంజూరు చేశామన్నారు. వీటిలో రెండు
పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తిచేస్తే
జిల్లాకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కలెక్టర్
శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇద్దరు ఎంపీలు.. మరిన్ని
నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉండడం హర్షణీయమన్నారు. పనుల మంజూరుకు
అవసరమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు త్వరగా
పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ముఖ్య ప్రణాళికాధికారి
వీవీఎస్ లక్ష్మీప్రసన్న, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ సూర్యనారాయణ,
నెడ్క్యాంజ్ జూనియర్ మేనేజర్ జయవాణి, తదితరులు పాల్గొన్నారు.