బీటీ రోడ్డు పనులెప్పుడు?
ABN , First Publish Date - 2021-05-11T05:24:19+05:30 IST
బీటీ రోడ్డు పనులెప్పుడు?
- మూడేళ్ల కింద రూ.2.25కోట్లు మంజూరు
మాడ్గుల: మండలంలోని నల్లచెరువుకు బీటీ రోడ్డు మంజూరై మూడేళ్లవుతున్నా ఇంకా పనులు మొదలు కాలేదు. బ్రాహ్మణపల్లి నుంచి నల్లచెరువు మీదుగా మాడ్గుల బీటీ రోడ్డు వరకు రూ.2.25కోట్లతో బీటీ రోడ్డు మంజూరైంది. నల్లచెరువు, గిరికొత్తపల్లి గ్రామాల మీదుగా వెళ్లే ఈ రోడ్డుకు మూడేళ్ల కింద ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శంకుస్థాపన చేశారు. కల్వర్టులు, సీసీ వేసి వదిలేశారు. ఈ రోడ్డుగుండా ప్రయాణాలు సాగించే గ్రామాల వారు మట్టి రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలు సైతం తిరగలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, పీఆర్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పట్టించుకొని కొన్ని గ్రామాలకు ప్రధాన రోడ్డు అయిన దీనికి బీటీ పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
- వానాకాలం కల్లా పనులు పూర్తి చేస్తాం
బీటీ రోడ్డు పనులను వచ్చే జూన్ 15వ తేదీ కల్లా పూర్తి చేయిస్తాం. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అనారోగ్యానికి గురికావడంతో అతడి తమ్ముడితో పనులు చేయిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల పనుల్లో ఆలస్యమైంది. ఇప్పటికే ఈ రోడ్డుపై అవసరమైన చోట్ల కల్వర్టులు పూర్తి చేశాం. మెటల్ వేసి దానిపై బీటీ వేసే పనులను ముమ్మరం చేస్తాం. వానాకాలం కల్లా పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- సూర్యవంశి, పంచాయతీ రాజ్ ఏఈ