Share News

PM MODI : బతికున్నా.. చచ్చినా ‘పన్ను’

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:03 AM

‘కాంగ్రెస్‌ వస్తే.. బతికున్నా పన్ను.. చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవితకాలమంతా కష్టపడి, చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది

PM MODI : బతికున్నా.. చచ్చినా ‘పన్ను’

  • కాంగ్రెస్‌ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై ‘పంజా’

  • ‘యువరాజు’ సలహాదారు చెబుతున్నదదే

  • ‘వారసత్వ పన్ను’పై మాట్లాడుతున్నారు

  • మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని

  • సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు

  • కర్ణాటకలో ముస్లింలకు.. బీసీల రిజర్వేషన్లు

  • పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం

రాయ్‌పూర్‌/భోపాల్‌, ఏప్రిల్‌ 24: ‘‘కాంగ్రెస్‌ వస్తే.. బతికున్నా పన్ను.. చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవితకాలమంతా కష్టపడి, చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది. వారసత్వ పన్నుపై యువరాజుకు(రాహుల్‌గాంధీని ఉద్దేశించి), రాచకుటుంబానికి సలహాదారు(శామ్‌ పిట్రోడా) మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం ఆ సలహాదారే చెప్పారు. ఇప్పుడు వారసత్వ పన్ను గురించి మాట్లాడుతున్నారు’’ అని ప్రధాని నరేంద్రమోదీమండిపడ్డారు.


బుధవారం ఆయన ఛత్తీ్‌సగఢ్‌లోని సుర్గుజా జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. అమెరికాలో వారసత్వ పన్నులాంటిది ఇక్కడ లేదని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యపై దుమారం రేగుతుండగా.. మోదీ కూడా ఇదే అంశంపై కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. వ్యక్తులు బతికున్నప్పుడే కాకుండా.. చనిపోయాక కూడా వారి సొమ్మును దోచుకోవడం కాంగ్రెస్‌ సూత్రంలా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.


‘కాంగ్రెస్‌ పార్టీ.. తమ పూర్వీకుల ఆస్తి అని వారు(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తుంటారు. దాన్ని వారి పిల్లలకు అందించారు. కానీ సగటు భారతీయులు మాత్రం తమ ఆస్తులను పిల్లలకు ఇవ్వడానికి మాత్రం వారు ఇష్టపడడం లేదు. పంజా(కాంగ్రెస్‌ పార్టీ చేయి గుర్తును ఉద్దేశించి) మీ ఆస్తుల్ని దోచుకుని, ప్రత్యేక కేటగిరీ(ముస్లింలను ఉద్దేశించి)కి సమానంగా పంచుతుందట’’ అని దుయ్యబట్టారు. మన పూర్వీకులు వారసుల పెళ్లిళ్ల కోసం బంగారు ఆభరణాలను కూడబెట్టారని, కాంగ్రెస్‌ దాన్ని కూడా దోచుకుంటుందని, దీనికి మీరు అంగీకరిస్తారా? అని రోడ్‌షోలో మోదీ ప్రశ్నించారు.


‘‘కాంగ్రెస్‌ కళ్లు మీ రిజర్వేషన్లపైనే కాదు..! మీ ఇళ్లపైన.. మీ సంపద పైన.. మీ ఇంట్లోని ప్రతి కప్‌బోర్డ్‌పైనా ఉన్నాయి. కానీ, నేను వారి చర్యలను అడ్డుకుంటాను’’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు ఓబీసీలకు అన్యాయం చేస్తోందని మోదీ ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం బీసీల కోటాను తగ్గిస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని హార్దాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. బీజేపీ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ వస్తే.. ఇండియా కూటమి నుంచి ఏడాదికో ప్రధాని వస్తారని ఎద్దేవా చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 05:07 AM