ఎస్ఐ పోస్టుల అక్రమాల్లో మంత్రి సోదరుడి ప్రమేయం
ABN , First Publish Date - 2022-05-03T18:27:50+05:30 IST
రాష్ట్రంలో సంచలనం కలిగించిన సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల అక్రమాలలో రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ సోదరుడి ప్రమేయం ఉన్నందున వెంటనే ఆయన
- రాజీనామాకు కాంగ్రెస్ నేత ఉగ్రప్ప డిమాండ్
బెంగళూరు: రాష్ట్రంలో సంచలనం కలిగించిన సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల అక్రమాలలో రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ సోదరుడి ప్రమేయం ఉన్నందున వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉగ్రప్ప డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగ్రప్ప మీడియాతో మాట్లాడుతూ మంత్రి సోదరుడు సతీష్ రామనగర్ జిల్లాలో ఎస్ఐ పోస్టుల నియమాకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓ అభ్యర్థి నుంచి రూ.85 లక్షలు తీసుకున్నారని, మాగడికి చెందిన మరో నలుగురి నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మంత్రి అశ్వత్థనారాయణ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. నిష్పక్షపాతంగా విచారణ సాగాలంటే ఆయన మంత్రి పదవిలో ఉండేందుకు వీలు లేదన్నారు. ఇదే విషయమై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ తనకున్న సమాచారం ప్రకారం మంత్రి సోదరుడు కాదని బంధువని తెలిసిందన్నారు. ఒకే తాలూకాలో ముగ్గురు ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యారన్నారు. వారు ఆస్తులు అమ్ముకుని నగదు సమకూర్చిన విషయం తాలూకాలో అందరికీ తెలిసిందన్నారు. సీఐడీ విచారణ జరుపుతున్నందున అంతకు మించి మాట్లాడేది లేదన్నారు. సీఎంకు నైతికత ఉంటే కుట్రలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలన్నారు.