ప్రజల కష్టాలకు Kcr కారణం: Vijayashanthi
ABN , First Publish Date - 2022-05-05T02:00:31+05:30 IST
తెలంగాణలో ప్రజల కష్టాలకు సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. సోషల్ మీడియా ద్వారా రాములమ్మ..
హైదరాబాద్: తెలంగాణలో ప్రజల కష్టాలకు సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. సోషల్ మీడియా ద్వారా రాములమ్మ.. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాలనాపరమైన అంశాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటారు. ఇందులోభాగంగా బుధవారం కూడా ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘‘కేసీఆర్ సర్కార్ పాలనలో ప్రజలు అరిగోసలు పడుతున్నరు. ప్రభుత్వ పథకం కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. రేషన్ కార్డుల కోసం ఏడు లక్షల దరఖాస్తులు సర్కారుకు అందగా, గతేడాది 3.10 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. హుజూరాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉపఎన్నిక సందర్భంగా వీరికి రేషన్ కార్డులు మంజూరు చేశారు. రాష్ట్రంలోని మిగతా 3.90 లక్షల దరఖాస్తులను కనీసం పరిశీలించకుండానే కేసీఆర్ సర్కార్ రిజెక్ట్ చేసింది. గత జూన్ నుంచే మీసేవలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా 2014 నుంచి 19 లక్షల రేషన్ కార్డులను తొలగించింది. ఎలాంటి పరిశీలన లేకుండా, కార్డుదారులకు నోటీసులు ఇవ్వకుండా బోగస్ కార్డులంటూ తొలగించారు. రాష్ట్రంలో మొత్తం 41.61 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో మూలుగుతున్నయి. రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందనే కారణంతో కొన్ని స్కీంలను పెండింగ్లో పెట్టిన కేసీఆర్ సర్కారు... డబ్బుతో సంబంధం లేని ఇతర అంశాలను కూడా ఇదే గాటన కట్టేసింది. ప్రభుత్వ తీరుతో స్కీంలు అందక, సమస్యలు పరిష్కారం కాక జనం అరిగోస పడుతున్నరు. అయినా కేసీఆర్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.70 లక్షల మంది ఎదురుచూస్తున్నరు. అప్లికేషన్లకు మూడు దఫాలుగా గడువు పొడిగించిన సర్కారు... పెన్షన్లను మాత్రం ఇప్పటిదాకా ఇవ్వనేలేదు. పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తమని గతేడాది సీఎం కేసీఆర్ ప్రకటించారు. సర్కారు జీవో కూడా జారీ చేసింది. మీ సేవ ద్వారా అప్లికేషన్లు తీసుకున్నరు. ఇందులో పదిన్నర లక్షల మంది అప్లై చేసుకున్నరు. అంతకుముందే 65 ఏండ్లు పైబడిన వాళ్లు 3 లక్షల మందికి పైగా అప్లై చేసుకుని ఎదురుచూస్తున్నరు. అయినా వారి గురించి పట్టించుకోవడం లేదు. ఇలా ఒక్కటి రెండు కాదు... అనేక రకాలుగా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ సర్కార్కు తగిన బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే రానుంది’’ అని విజయశాంతి హెచ్చరించారు.