ఆరు రుచుల నారింజ పచ్చడి

ABN , First Publish Date - 2022-05-14T07:54:34+05:30 IST

క్యాల్షియం, ఎ, బి, సి విటమిన్లు, ఇనుము శరీరానికి తేలికగా వంటబడతాయి.

ఆరు రుచుల నారింజ పచ్చడి

కూరగాయల్లోకన్నా పండ్లలో ఒక ప్రత్యేకత ఉంది. వీటి రసాయనాలు ఔషధాలుగా పనిచేస్తాయి. షుగర్స్‌, క్యాల్షియం, ఎ, బి, సి విటమిన్లు, ఇనుము శరీరానికి తేలికగా వంటబడతాయి. నరాలకు, గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి. ‘కృపాటక ఫలం’ గురించి నలుడు చెప్పిన విషయాలు నారింజ, దబ్బ, పంపర పనస లాంటి సిట్రస్‌ ఫలాలన్నింటికి వర్తిస్తాయి. దీన్నే కురుంబా అని కూడా అంటారని, సిట్రస్‌ అరాంటియం పేరుతో పిలిచే మొక్క ఇదేనని, ఇది నారింజ లేదా దబ్బకాయకు వర్తించే పేరని పాకదర్పణానికి ఆంగ్లవ్యాఖ్యానం రాసిన డా. మధూలిక  పేర్కొన్నారు. 


నారింజ/దబ్బ పచ్చడి ఇలా తయారుచేసుకోవాలి

నారింజ లేదా దబ్బపండుని తోలుతో సహా చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కల్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచి, గింజల్ని, తొనలపైన ఉండే తెల్లనిపొరనీ వేరుచేసి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ భాండీలో ఉడికించాలి. కొద్దిగా చింతపండు రసం, ఉప్పు, మిరియాలు, అల్లం, ఇతర సుగంధ ద్రవ్యాలు చేర్చి నేతితో వేగనివ్వాలి. ఆవాలు మెంతులు, జీలకర్ర ఇంగువలతో తాలింపు పెట్టాలి. కొత్తిమీర, కరివేపాకు చేర్చి రుచికరంగా చేసుకోవాలి. గోదావరి జిల్లాల్లో దీన్ని ఇష్టంగా తింటారు. భోజనం లోనే కాదు టిఫిన్లలో చట్నీగా కూడా తింటారు. దీన్ని బెల్లం లేదా పంచదారతో కలిపి తింటే చెడు చేయకుండా ఉంటుందనీ, దీన్ని తినగానే ఎక్కువ నీళ్ళు తాగవద్దని కొన్ని వైద్య గ్రంథాలు చెప్తున్నాయి. 


ఆహార ద్రవ్యాలకు నలుడు చెప్పిన గుణాలు ప్రామాణికమైనవి. చేదుగా ఉండే ఆహారపదార్థాల్లో ఇది ముఖ్యమైంది. విష దోషాలు హరిస్తుంది. జఠరాగ్నిని పెంచుతుంది. తేలికదనాన్నిస్తుంది. తల్లిపాలు పెరిగేలా చేస్తుంది. కడుపులో ఏలికపాముల్ని పోగొడుతుంది. కుష్టు లాంటి భయంకర చర్మవ్యాధుల్లో మేలు చేస్తుంది. నిద్రపట్టిస్తుంది. మూత్రం, విరేచనం అయ్యేలా చేస్తుంది. మూర్ఛవ్యాధిని తగ్గిస్తుంది. సమస్త మూత్రవ్యాధుల మీద ముఖ్యంగా షుగరు వ్యాధి పైన దీనికి ఎక్కువ ఉపయోగం ఉంది. పొట్టలో ఉండే లివర్‌, స్ప్లీన్‌, పాంక్రియాజ్‌ లాంటి అవయవాలకు బలానిస్తుంది. వేడి వలన కలిగే లక్షణాలను, జ్వరాన్నీ తగ్గిస్తుంది. రక్తదోషాల్ని పోగొడుతుంది.


నారింజ, బత్తాయి, దబ్బ, పంపరపనస, గజనిమ్మ లాంటివాటి పైన ఉండే తోలు బాగా చేదుగా ఉంటుంది. కానీ వీటికి ఒక రకమైన సుగంధం ఉంటుంది. ఈ తోలుని కూడాకలిపే వండుకునే అలవాటు నలుడి కాలం నుండీ మనకుంది. తొక్కల్ని ఎండించి మెత్తగా దంచి చారు(రసం) పొడిగా లేదా టీ పొడిగా వాడుకుంటే రుచిగా ఉంటుంది. వీటి తోలుని అలాగే ఉంచి ఊరుగాయలు పెడతారు. అంటే ఈ తోలు తినదగిందేనన్నమాట. నలుడు రోజువారీ కూరగానో పచ్చడిగానో చేసుకునేప్పుడు కూడా ఈ తోలునీ కలిపి వండుకునే విధానాన్ని సూచించాడు. ఇది ఉగాది పచ్చడిలా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంగా ఉంటుంది.  

గంగరాజు అరుణాదేవి

Read more