చట్టాలపై అవగాహన కోసమే విజ్ఞాన సదస్సు

ABN , First Publish Date - 2022-05-12T05:30:00+05:30 IST

ప్రజలందరికీ చట్టాలపై అవగాహన కల్పించడానికే ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని ఉట్నూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ అన్నారు.

చట్టాలపై అవగాహన కోసమే విజ్ఞాన సదస్సు

ఉట్నూర్‌, మే 12: ప్రజలందరికీ చట్టాలపై అవగాహన కల్పించడానికే ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని ఉట్నూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఉమ్రి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టం అందరికీ సమానమేనని, పలు చట్టాల గురించి వివరించారు. రైతులు నకిలీ విత్తనాలు వాడవద్దని, లైసెన్స్‌డ్‌ దుకాణాలలో విత్తనాలు కొనుగోలు చేసి వాటికి కావాల్సిన రశీదులను తప్పకుండా తీసుకోవాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు విత్తనం కల్తీది అయితే సదరు కంపెనీ నుంచి నష్టం పొందే అవకాశం ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. యువకులు చెడు వ్యసనాలకు లోనైతే జరగబోయే పరినామాలు చెడ్డగా ఉంటాయని అన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు మంచి పెంపకం ఇవ్వడంతో పాటు గౌరవ మర్యాదలు, సంస్కారం చిన్ననాటి నుంచే తెలియజేయాలని అన్నారు. సమావేశంలో ఉట్నూర్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు జమీర్‌ఖాన్‌, బానోత్‌ జగన్‌, ఎస్సై భరత్‌సుమన్‌, సర్పంచ్‌ విఠల్‌ పవార్‌, గ్రామస్థులు, లీగల్‌ సర్వీసెస్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 

Read more