AP: కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-05-09T16:46:50+05:30 IST

విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది.

AP: కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ హెచ్చరిక

విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 810 కి.మీ. పూరీకి దక్షిణాగ్నేయంగా 880 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో బంగాళాఖాతంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, ముక్కాం తీరంలో సముద్రం 20 మీటర్ల మేర ముందుకొచ్చింది. మంగళ, బుధవారాల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల మొస్తరుగా.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. కోస్తాలోని అన్నీ ఓడరేవుల్లో రెండో నెంబర్ హెచ్చరిక ఎగురవేశారు. విజయనగరం జిల్లా భోగాపురం పూసపాటిరేగ మండలాల్లోని 21 గ్రామాల్లో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.


కాగా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భీమవరం, వీరవాసరం, నరసాపురం, పెదవేగి, ముదినేపల్లి, చింతలపూడి, గణపవరం, భీమడోలు, పెదపాడు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కురిసిన భారీ వర్షానికి ధాన్యం రాశుల్లోకి నీరు చేరింది. వరి మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల 30 వేల ఎకరాలలో సాగు చేయగా లక్షా 30 వేల ఎకరాలు మాసూళ్ళు అయినప్పటికీ ఎక్కువ ధాన్యం రాశులు గాను, ధాన్యం ఎండ బెట్టే దశలోనూ ఉన్నాయి. వాటితోపాటు లక్షా పదివేల ఎకరాలు పంట చేనుగానే ఉంది. దీంతో రైతుల్లో పరుగులు, అలజడి వర్షం పెరిగేలా చేసింది. తుఫాన్‌ గండం ఉందని సూచన రావడంతో రైతులు మరింత కంగారు పడుతున్నారు. 

Read more