-
-
Home » Andhra Pradesh » ycp byreddy vs mla arthur-MRGS-AndhraPradesh
-
Nandikotkurలో పొలిటికల్ హీట్.. Byreddy Vs Arthur.. అసలేం జరుగుతోంది..!
ABN , First Publish Date - 2022-05-07T16:55:11+05:30 IST
నందికొట్కూరు. నంద్యాల జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఆర్థర్ గెలుపొందారు. అయితే ఈ నియోజకవర్గం పై పెత్తనమంతా...
నంద్యాల జిల్లా నందికొట్కూరులో రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటిదాకా వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరితే తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగారు. మరోపక్క కొంతమంది వైసీపీ కార్యకర్తలు బీజేపీలో చేరడం నియోజకవర్గంలో సెన్సేషన్గా మారింది. ఇంతకీ నందికొట్కూరులో అసలేం జరుగుతోంది. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్సైడ్లో తెలుసుకుందాం..
బైరెడ్డి కుటుంబానికి, ఆర్థర్కు మధ్య పచ్చగడ్డి వేసిన మండుతుంది
నందికొట్కూరు. నంద్యాల జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఆర్థర్ గెలుపొందారు. అయితే ఈ నియోజకవర్గం పై పెత్తనమంతా తొలినుంచి బైరెడ్డి, గౌరు కుటుంబాలదే. కానీ ఆర్థర్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఉన్నతచదువులు, అసెంబ్లీచీఫ్ మార్షల్గా పనిచేసిన అనుభవంతో తనపై ఎవరి పెత్తనాన్ని సహించేది లేదంటూ ఆయన కుండబద్దలు కొట్టడంతో వైసీపీలో వర్గపోరు ముదిరింది. ఎమ్మెల్యేగా తనమాటే చెల్లుబాటు కావాలని, తనపై ఎవరి పెత్తనాన్ని సహించనంటూ తదనుగుణంగానే పనిచేసుకుంటుపోతున్నారు ఆర్ధర్. దీంతో ఆది నుంచి నియోజకవర్గంపై పట్టున్న బైరెడ్డి కుటుంబానికి, ఆర్థర్కు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది.
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డామినేట్ రాజకీయాలు
నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడి నుంచి బైరెడ్డి, గౌరు కుటుంబాలు కదలడం లేదు. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని, తమ హవా చూపుతున్నారు. అయితే ఆర్థర్ విషయంలో ఇది రివర్స్ అయింది. దీంతో నందికొట్కూరు విషయం వైసీపీ హైకమాండ్కు తలనెప్పిగా మారింది. ఒకానొకదశలో ఆర్థర్ రాజీనామాలకు కూడా సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. నియోజకవర్గంపై యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధిపత్యాన్ని ఆర్థర్ భరించలేకపోతున్నారని టాక్. ఇది పలుసార్లు బహిర్గతమైంది కూడా. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా, తెర వెనక మాత్రం ఆధిపత్య రాజకీయాలు చేస్తోంది ఈ రెండు కుటుంబాలేనన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డామినేట్ రాజకీయాలను ఆర్థర్ సహించలేకపోతున్నారని నందికొట్కూరు జనం టాక్. అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త కావడంతో తన మాటే చెల్లుబాటు కావాలంటూ హుకూం జారీచేస్తున్నారు. మరో పక్క ఎమ్మెల్యేకూడా గట్టిగానిలబడటుతుండటంతో ఎవరు చెప్పిన పనిచేయాలో తెలియక అధికారులు బెంబేలు పడుతున్నారు.
బైరెడ్డి సిద్థార్థరెడ్డి తెలుగుదేశంలో చేరిపోయారనే ప్రచారం
గతంలో వీరి మధ్య సయోధ్యకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఓపక్క నియోజకవర్గంలో ఈ వర్గపోరు సాగుతుండగానే ఇటీవల బైరెడ్డి సిద్థార్థరెడ్డి తెలుగుదేశంలో చేరిపోయారనే ప్రచారం సంచలనంగా మారింది. సిద్ధార్థరెడ్డి లోకేష్ను కలిశారని, ఇక తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ తనకు తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన అసవరం లేదంటూ సిద్థార్థరెడ్డి తేల్చి చెప్పారు. కానీ నిప్పులేనిదే పొగరాదు కదా టైపు మాటలు ఆయన చెవిన పడుతూనే ఉండటంతో తాను తెలుగుదేశంలో చేరడం లేదని నిరూపించుకోవాల్సిన అసవరమేర్పడింది. దీంతో ఇటీవల ఓ ప్రెస్మీట్ పెట్టి మరీ నందికొట్కూరు తెలుగుదేశం నేతలపైన ఇంతెత్తున విరుచుకుపడ్డారు. తెలుగుదేశం హయాంలో నియోజకవర్గంలో అభివృద్ది ఏమీ జరగలేదవంటూ విమర్శలకు దిగారు.
నందికొట్కూరులో పెరిగిన పొలిటికల్ హీట్
పనిలోపనిగా నియోజవర్గం టీడీపీ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం, వైసీపీ మధ్య ఈ స్థాయి విమర్శలు ఎన్నడూ చోటు చేసుకోలేదు. కానీ హఠాత్తుగా బైరెడ్డి సిద్థారెడ్డి తెలుగుదేశంపై విమర్శలు ఎక్కుపెట్టడం వెనుక తాను టీడీపీకి దూరమని చెప్పడానికేనని ఈ ప్రయత్నమంతా అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనిపై తెలుగుదేశం ఇన్చార్జ్ మాండ శివానందరెడ్డి కూడా గట్టిగానే స్పందించారు. సిద్ధారెడ్డి తెలుగుదేశంలోకి చేరడానికి ఎవరి కాళ్ళు పట్టుకున్నారో తమకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలతో నందికొట్కూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. దీనికితోడు వైసీపికి చెందిన దాదాపు 150మంది కార్యకర్తలు బైరెడ్డి శబరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం కూడా నియోజకవర్గంలో సెన్సేషన్గా మారింది. ఓ పక్క ఆర్థర్ వర్సెస్ సిద్థార్థరెడ్డి, మరోపక్క టీడీపీపై సిద్థార్థరెడ్డి విమర్శలకు దిగడం,దీనికి టీడీపీ కౌంటర్ ఇవ్వడం, ఇంకొక్క పక్క వైసీపీ కార్యకర్తలు బీజేపీ గూటికి చేరడంతో నందికొట్కూరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.