-
-
Home » Andhra Pradesh » East Godavari » YSRCP Key Leader Joins Telugudesam party-MRGS-AndhraPradesh
-
చంద్రబాబు సమక్షంలో TDP కండువా కప్పుకున్న YSRCP కీలక నేత
ABN , First Publish Date - 2022-05-06T20:17:16+05:30 IST
చంద్రబాబు సమక్షంలో TDP కండువా కప్పుకున్న YSRCP కీలక నేత
కాకినాడ : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి (YSRCP) ఊహించని రీతిలో షాక్ తగిలింది. పెద్దాపురానికి చెందిన కీలక నేత బొడ్డు వెంకటరమణ చౌదరి వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాల పర్యటనలో బిజిబిజీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నవరంలో పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీలో చేరారు. తెలుగుదేశం కండువా కప్పిన Chandrababu.. వెంకటరమణను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశమే తనకు శిరోధార్యమని చెప్పుకొచ్చారు.
చేరిక ఇలా..!
కాగా.. ఇటీవల పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణా రెడ్డి ఇద్దరూ వెంకటరమణ చౌదరిని కలిసి అనంతరం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇవాళ ఆ జిల్లాలోనే పర్యటిస్తుండగా.. చౌదరి తెలుగుదేశంలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దివంగత నేత, సీనియర్ రాజకీయవేత్త బొడ్డు భాస్కర రామారావు తనయుడే వెంకటరమణ.
అధిష్టానమే నిర్ణయిస్తుంది..
పార్టీలో చేరక మునుపు మీడియాతో బొడ్డు మాట్లాడుతూ.. రానున్న కాలంలో పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తాను కృషిచేస్తానని, భవిష్యత్తులో పార్టీలో తన పాత్రేమిటో పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని తెలిపారు. తన తండ్రి గత నాలుగు దశాబ్దాల కాలంలో పెద్దాపురం నియోజకవర్గంతోనూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతోనూ, అభిమానులతోనూ ఉన్న అనుబంధం దృష్ట్యా తాను తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని భావించినట్టు తెలిపారు. తాను ఏ పదవులూ ఆశించి తెలుగుదేశం పార్టీలోకి చేరడం లేదన్నారు.